జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరించిన ఏపీ శాసనమండలి చైర్మన్

  • ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ
  • నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
  • రాజీనామాపై హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం వెల్లడి 
  • సమాధానం సంతృప్తికరంగా లేదన్న ఛైర్మన్ 
  • యథాతథంగా కొనసాగనున్న జయమంగళ ఎమ్మెల్సీ పదవి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవి యథాతథంగా కొనసాగనుంది.

వివరాల్లోకి వెళితే, 2024 నవంబరులో జయమంగళ వెంకటరమణ వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తన రాజీనామాను ఛైర్మన్ ఉద్దేశపూర్వకంగా ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, జయమంగళ రాజీనామాపై మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని మండలి ఛైర్మన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది సైతం హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఛైర్మన్ మోషేన్ రాజు, జయమంగళ రాజీనామాను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాకు జయమంగళ సమర్పించిన సమాధానం సంతృప్తికరంగా లేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల తర్వాత చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజీనామా తిరస్కరణకు గురవడంతో చట్టప్రకారం జయమంగళ ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

కాగా, అప్పట్లో వైసీపీకి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ... పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. 

Jayamangala Venkataramana
Resignation
Moshen Raju
MLC
YSRCP
Janasena

More Telugu News